Lakhbir Singh Landa : కెనడా గ్యాంగ్‌స్టర్‌ ఉగ్రవాదిగా ప్రకటన

దేశవ్యాప్తంగా అతడిపై అనేక కేసులు ఉన్నాయని ప్రకటన

Update: 2023-12-31 02:00 GMT

ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కి చెందినవాడు. లఖ్‌బీర్ సింగ్ 2021వ సంవత్సరంలో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడి ప్రణాళికలో పాల్గొన్నాడు. 2022లో టార్న్ తరణ్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలో లాండా పేరు కూడా ఉంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన లఖ్‌బీర్ సింగ్ గత కొన్నేళ్లుగా కెనడాలో నివశిస్తున్నాడు. భారతదేశంపై కుట్ర పన్నుతున్న ఇతన్ని ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది.

గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండా దేశవ్యాప్తంగా పలు ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యలు, ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పంజాబ్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనల్లో ప్రమేయం ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అతడు అల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో నివసిస్తున్నాడని తెలిపింది. ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందినవాడని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. కాగా లఖ్‌బీర్ సింగ్ తండ్రి పేరు నిరంజన్ సింగ్, తల్లి పేరు పర్మీందర్ కౌర్‌ అని తెలిపింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థ జాబితాలో ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా 2021లో మొహాలీలోని పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ భవనంపై జరిగిన దాడి ఘటనలో లఖ్‌బీర్ సింగ్ లాండా ప్రమేయం ఉంది. ఓ సరిహద్దు ఏజెన్సీ సాయం అందించడంతో అతడు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు సరిహద్దు అవతల నుంచి పేలుడు పదార్థాలు, అధునాతన ఆయుధాలను సరఫరా చేయడంలో అతడి భాగస్వామ్యం ఉందని తేలింది. పలు ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యలు, ఐఈడీలు అమర్చడం, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు పంజాబ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనల్లో లఖ్‌బీర్ సింగ్ లాండాపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. లాండా, అతడి అనుచరులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపీడీలతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ పేర్కొంది. పంజాబ్ రాష్ట్రంలో శాంతి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపింది. అతడిపై ఓపెన్-ఎండెడ్ వారెంట్ కూడా జారీ అయ్యింది.

Tags:    

Similar News