PM Modi: అమెరికా చేరుకున్న మోదీ.. మస్క్తో భేటీ అయ్యే అవకాశం
ప్రవాస భారతీయులు ఘన స్వాగతం;
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. తొలుత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోదీ ఆ ట్రిప్ను ముగించుకొని అట్నుంచి అటే యూఎస్ వెళ్లారు. ఇవాళ వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకిప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రధాని ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టు చేశారు. అదేవిధంగా భారత్ అమెరికా భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇక తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ.. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు కాంగ్రెస్ చట్టసభ సభ్యులు, ఇతర ప్రముఖులతో భేటీ కానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్తో కూడా మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ లింక్ (Star Link) సేవలపై ఆయనతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వలసదారుల అంశం, టారిఫ్లు వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది.