AP: పల్నాడులో అదుపులోకి వస్తున్న పరిస్థితులు

AP: పల్నాడులో అదుపులోకి వస్తున్న పరిస్థితులు
భారీగా కేంద్ర బలగాల మోహరింపు.... జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

పల్నాడులో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. ఎన్నికల అనంతరం దాడులు, హింస చెలరేగడంతో ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్ర బలగాలను మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.


పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ముగ్గురుకు మించి జనం గుమిగూడినాస మావేశాలు, సభలు నిర్వహించినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కారంపూడిలో పిన్నెల్లి, గురజాల నియోజకవర్గం కొత్తగణేషునిపాడులో కాసుమహేశ్‌రెడ్డి హల్‌చల్‌ చేయడంతో ఆయా ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేవలం మాచర్ల, కారంపూడి పట్టణాల్లో 12వందల మంది పోలీసుల్ని నియమించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని గృహనిర్భందం చేశారు. పట్టణంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు నియమించారు. మాచర్లకు వచ్చే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


నరసరావుపేటలోనూ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో....పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. తెలుగుదేశం అభ్యర్థి అరవింద్‌బాబుతోపాటు వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహనిర్బంధించారు. వారి ఇళ్లవద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. నరసరావుపేటలోనే నివాసం ఉంటున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డిని కూడా గృహనిర్బంధించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున...పోలీసుల ఆదేశాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకలగుంటలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసుల వాహనానికి అడ్డునిలిచిన గ్రామాస్తులు...ఆందోళనకు దిగారు. వైకాపా నేతల ఒత్తిడితోనే అరెస్ట్‌లు సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ విచారణలో భాగంగానే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు సర్దిచెప్పారు. నకరికల్లు స్టేషన్‌కు తీసుకెళ్లి, సంతకాలు చేయించుకుని బాజిని పంపించివేయడంతో.... వివాదం సద్దుమణిగింది.

Tags

Next Story