AP : నేటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రచారం కోసం ‘బాలయ్య అన్స్టాపబుల్’ పేరుతో స్పెషల్ బస్సును రూపొందించారు. NDA అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాయలసీమలో ఆయన పర్యటించనున్నారు. ఈనెల 19న హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 25 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు.
ఉదయం 9 గంటలకు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బస్సు యాత్రకు బయలుదేరుతారు. వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బాలకృష్ణ కు రాయలసీమలో ఎక్కువ మంది అభిమానులున్న కారణంగా అక్కడి నుంచే ఆయన బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే హిందూపురం నుంచి రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక వైసీపీలో వర్గపోరు కూడా బాలయ్యకు కలిసి వస్తోంది. ఈ వర్గపోరు కారణంగానే గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిగా బాలకృష్ణ మీద పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్.. ఈసారి టీడీపీ గూటికి చేరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com