AP: జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టిన కాగ్‌

AP: జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టిన కాగ్‌
రహదారులు, వంతెనల విస్తరణలో తీవ్ర నిర్లక్ష్యమంటూ స్పష్టీకరణ

జగన్‌ ప్రభుత్వ తీరుపై మరోసారి కాగ్‌ మండిపడింది. రహదారులు, వంతెనల విస్తరణ, పునర్‌నిర్మాణం వంటి పనులపై జగన్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపించిందని కాగ్‌ స్పష్టం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరం చివరికి పూర్తికావాలనే లక్ష్యంతో ఉన్న రహదారుల్లో అత్యధిక రహదారులు, వంతెనల పనులు జరగలేదని కొన్నే పూర్తయ్యాయని తెలిపింది. కీలకమైన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రాజెక్ట్‌ పనులు మరీ ఘోరంగా జరిగాయంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు గుత్తేదారులకు నిధులివ్వకపోవడంతో ఎక్కువ పనులు జరగలేదని తేల్చిచెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్‌ ఖరారుచేసిన లెక్కలు రోడ్ల పనుల దుస్థితి ఎంత అధ్వానంగా ఉందో చెబుతున్నాయి. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌ కింద బ్యాంకు రుణంతో 13 ఉమ్మడి జిల్లాల్లో 122 రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. వీటికి 2 వేల 749.04 కోట్లతో టెండర్లు పిలిచి 2021 మార్చిలో గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ పనులు 2023 మార్చి నాటికి పూర్తికావాలి. కానీ రాష్ట్రమంతా కలిపి 2023 మార్చి చివరికి 8.12శాతం పనులే జరిగాయి. గుత్తేదారులకు ప్రభుత్వం చెల్లించింది 108.05 కోట్లే. కర్నూలు జిల్లాలో 3శాతం, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో 5శాతం పనులే జరిగాయి. కొన్నిచోట్ల గుత్తేదారులకు చెల్లింపులే జరగలేదు.

అన్ని జిల్లాల్లో కేపిటల్‌ వర్క్స్‌ కింద మంజూరైన రహదారుల్లో పనుల్లో పూర్తికానివే అధికంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లా కావలిలో ఓల్డ్‌ ఎంసీ రోడ్డును 55 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేలా 2021లో నిధులు మంజూరుచేశారు. 2023 మార్చికే పూర్తికావాల్సి ఉన్నా.. 16శాతం పనులే జరిగాయి. చిత్తూరు జిల్లాలోని కల్లుపల్లె-చౌడేపల్లి రోడ్డు నుంచి అనంతపురం-పలమనేరు రోడ్డు వరకు 12 కిలో మీటర్ల విస్తరణకు 24 కోట్లు 2021లో మంజూరుచేశారు. ఇది 2023 నాటికి పూర్తికావాల్సి ఉండగా, 30 శాతం పనులే జరిగాయి.

నంద్యాల పురపాలక పరిధిలో 2.5 కిలో మీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2021లో 13.40 కోట్లు మంజూరు చేయగా..... 2023 నాటికి 10శాతం పనులే జరిగాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం-చింతపల్లి-సీలేరు రోడ్డును ఆరు ప్యాకేజీలుగా 84 కోట్లతో విస్తరించేందుకు 2019లో ప్రభుత్వం మంజూరుచేసింది. ఇవన్నీ 2021కి పూర్తికావాలి. కానీ 2023కి రెండు ప్యాకేజీల్లోనే 82శాతం, 61శాతం పనులు జరిగాయి. మిగిలిన నాలుగు ప్యాకేజీల్లో 6నుంచి 17శాతం పనులే చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా పోరుమామిళ్లలో 5 కిలో మీటర్ల రోడ్డును 25 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2022లో ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. ఏడాదిలో పనులు పూర్తికావాల్సి ఉండగా, 33 శాతం పనులే చేశారు. గుత్తేదారుకు ఏమీ చెల్లించలేదు.

Tags

Read MoreRead Less
Next Story