AP: ఏపీలోఅసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపు

AP: ఏపీలోఅసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపు
అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు... ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా ఎన్నికల సంఘం చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం అసాధారణ స్థాయిలో ఓట్లు తొలగించడంపై ప్రతిపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముసాయిదా జాబితాలో అక్రమాలు, అవకతవకలపై అనేక ఫిర్యాదులు చేసినా ఈసీ తూతూమంత్రపు చర్యలతో తుదిజాబితా విడుదల చేసిందని విమర్శిస్తున్నాయి. ఏడాది కాలంలో ఏకంగా 30 లక్షల ఓట్లు తీసేయడం అసాధారణమని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం.... తాజాగా విడుదల చేసిన తుది ఓటరు జాబితాపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2023 జనవరి 6 నుంచి 2024 జనవరి 22 మధ్య ఏడాది వ్యవధిలో 30 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించారు. వాటిల్లో దాదాపు సగం అంటే 14లక్షల 26 వేల ఓట్లు వలస వెళ్లారనే సాకుతో తీసేయటంపై అనుమానాలు నెలకొన్నాయి. వలసల పేరిట.. ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లు తీసేశారనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఓట్ల తొలగింపు జాబితాలో మృతులు, ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉండటం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకు విరుద్ధంగా వలసల పేరిట అసాధారణ స్థాయిలో ఓట్లు తీసేయటం, అది కూడా మరో 2, 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో తొలగించటంపై అనుమానాలు నెలకొన్నాయి.


2022 జనవరి 6 నుంచి 2023 జనవరి 5 మధ్య అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 11,23,829 ఓట్లు తొలగించగా.. అందులో వలసల పేరిట 1,11,578 ఓట్లు తొలగించారు. ఐతే ప్రస్తుతం ఒక్క వలసల పేరుతోనే 14.26 లక్షల ఓట్లు తొలగించారు. ఏడాదిలో అన్ని విభాగాల్లో కలిపి తీసేసిన మొత్తం ఓట్లలో ఇది 47.53 శాతం. నిజంగానే ఆ తొలగించిన ఓట్లన్నీ వలస వెళ్లినవారివేనా? అర్హులవీ ఉన్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు తప్పుడు వివరాలతో ఫాం-7 దరఖాస్తులు పెట్టే నేరపూరిత కుట్రను వైకాపా రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకృతం చేసింది. ఈ దరఖాస్తుల ఆధారంగా సమగ్ర విచారణ లేకుండానే ఓట్లు తొలగించేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులిస్తూనే ఉన్నాయి.


తప్పుడు సమాచారంతో ఫాం-7 దరఖాస్తులు పెట్టి ప్రతిపక్షాలకు మద్దతిచ్చేవారి ఓట్లు తొలగించే నేరపూరిత కుట్ర పర్చూరు నియోజకవర్గంలో పెద్దఎత్తున అమలైంది. అక్కడ ఏకంగా 13,588 ఓట్లు తొలగించేశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైసీపీ నేతల ఓట్ల అక్రమాలకు సహకరించారంటూ IAS అధికారి గిరీషాను సస్పెండ్‌ చేసిన ఎన్నికల సంఘం... ఆ ఎన్నిక జరిగిన రెండున్నరేళ్ల తర్వాత కూడా ఆబ్సెంటీ ఓట్లను జాబితానుంచి తొలగించలేదు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో మొత్తం 38,396 మంది ఓటర్లు ఆయా చిరునామాల్లో లేకుండా శాశ్వతంగా వెళ్లిపోయినట్లు తేలింది. వీటిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా.. తాజాగా విడుదలైన తుది జాబితాలోనూ ఈ ఆబ్సెంటీ ఓట్లలో చాలావరకూ యథాతథంగా కొనసాగించారు పార్వతీపురం మన్యం జిల్లాలోని 4నియోజకవర్గాల్లో గడిచిన ఐదేళ్లలో 65 వేల 999 మంది ఓటర్లు పెరిగారు. ఒక ఏడాదిలో వెయ్యి మంది పెరిగితే.. ఐదేళ్లలో ఐదు వేలకు అటుఇటుగా పెరగాలి. అందుకు భిన్నంగా భారీగా నమోదవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలకు అధికార పార్టీ తెరలేపిన వైనం తాజాగా వెలుగుచూసింది. అర్హుల ఓట్ల తొలగింపునకు నకిలీ ఫాం-7లు పెట్టారంటూ వీరందరిపైనా కోటబొమ్మాళి, నందిగాం పోలీసుస్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story