SC: జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ

విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు చేపట్టడంపై స్టే విధిస్తూ.. ఏపీ ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదని ఆదేశించింది. సినీ అవసరాలకు వినియోగించేందుకు 35 ఎకరాల భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం రామానాయుడు స్టూడియోకు కేటాయించింది. కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు కొట్టేసినా....
ఇదే కేసును హైకోర్టు కొట్టివేయడంతో.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమిని ఎందుకు కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది మార్చి 11లోపు స్పందించాలంటూ తెలంగాణ ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com