TDP: ఓటమి భయంతో వైసీపీ రక్త చరిత్ర

TDP: ఓటమి భయంతో వైసీపీ రక్త చరిత్ర
ఓటమి భయంతోనే దాడులన్న టీడీపీ... సిట్‌ అధినేత వినీత్‌ను కలిసిన టీడీపీ నేతలు

ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఏపీలో రక్త చరిత్ర సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి సోదరులు, చెవిరెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి, పెద్దారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని టీడీపీ బృందం.... సిట్ అధినేత ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను పెన్ డ్రైవ్ రూపంలో సమర్పించారు. జగన్ తో కలిసి సీఎస్ జవహర్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, మరికొందరు అధికారులు హింసాకాండకు కుట్రలు చేశారని వారి కాల్ డేటా బయటకు తీస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.

అరెస్టులు మొదలు

పల్నాడు జిల్లా కారంపూడిలో ఈనెల 14న జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై అరెస్టులు ప్రారంభమయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేయటంతో పాటు ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొన్ని వాహనాల్ని తగులబెట్టారు. ప్రతిచర్యగా టీడీపీ వర్గీయులు రోడ్లపైకి వచ్చి వైసీపీకి చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు. ఈ రెండు ఘటనలపైనా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. దాడులకు సంబంధించి పోలీసులు వైసీపీకి చెందిన 11మందిని, టీడీపీకి చెందిన 8మందిని అరెస్టు చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేసి వారిని కోర్టుకు తరలించే సందర్భంగా కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. గొడవలు జరిగిన రోజు అక్కడ లేకపోయినా పోలీసులు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. నిజంగా దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా వదిలేశారన్నారు.

ఈసీ ఆగ్రహం

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

Tags

Next Story