TDP: 'క్విట్ జగన్.. సేవ్ ఏపీ'.. ఇదే టీడీపీ కొత్త నినాదం..
TDP: క్విట్ జగన్.. సేవ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో పార్టీలన్నీ ఈ నినాదాన్ని ఎత్తుకుంటున్నాయి. జగన్ను రాష్ట్రం నుంచి పంపించేయాలనే నినాదం చేసింది టీడీపీనే అయినా.. విపక్షాలదీ అదే మాట. జగన్ పరిపాలించింది ఇక చాలు అంటున్నాయి. ఇప్పటి దాకా రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలని అంటున్నాయి. రాష్ట్రం మరింత భష్ట్రుపట్టకముందే తేరుకుని, జగన్ను పంపించేయాలనే కసితో ఉన్నాయి.
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా జనాల వద్దకు వెళ్తున్న టీడీపీ నేతలకూ ఇదే విధమైన రెస్పాన్స్ వస్తోంది. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోయినా సరే బాదుడే బాదుడు అన్నారు జగన్. విద్యుత్ ఛార్జీలు పెంచకపోయినా జగన్ బాదుడే బాదుడు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధర తగ్గించినా బాదుడే బాదుడు అన్నారు. అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తానన్న జగన్.. ఇప్పుడు వీర బాదుడు బాదుతున్నాడంటూ జనం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
క్విట్ జగన్ అనే నినాదం జనాల్లో కనబడడంతో.. క్విట్ జగన్-సేవ్ ఏపీ అనే స్లోగన్ను అందుకుంది టీడీపీ. అందుకే, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అందరూ కలిసి రావాలని, త్యాగాలకు సైతం సిద్ధమని అన్నారు చంద్రబాబు. జగన్ది ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది ముమ్మాటికీ నిజం అంటున్నారు ఏపీ ప్రజలు.
ఎందుకంటే, విభజన తరువాత రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్నప్పుడు ఏపీ లోటు బడ్జెట్లో ఉంది. అయినా.. ఎక్కడా అభివృద్ధి ఆగలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న మాటే రాలేదు. బొగ్గు నిల్వలు అయిపోలేదు. ఎండాకాలంలోనూ కరెంట్ కోతలు కనిపించలేదు. ఉద్యోగులకు నెలాఖరున జీతాలివ్వడం జరగలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నడూ రోడ్డెక్కలేదు. జెన్కో లాంటి సంస్థలు దివాళా దశకు చేరుకోలేదు.
8 మంది ఐఏఎస్లకు కోర్టు శిక్ష విధించిన ఘటనలు జరగలేదు. పెట్టుబడులు వెనక్కి పోవడం అన్నదే లేదు. కాని, జగన్ ప్రభుత్వంలో మాత్రం రాష్ట్రం గతంలో ఎన్నడూ చూడనంత నాశనం అయిందంటూ గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు పాలనను, జగన్ పాలనను పోల్చి చూస్తున్నారు. ఇక జనసేన పార్టీ కూడా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఎప్పుడో పిలుపిచ్చింది.
దళితులపై దాడులు, రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనంటూ చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ సర్కార్కు పాలించే అర్హత లేదని, వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు రోడ్మ్యాప్ చెప్పాలంటూ బీజేపీకి సూచించారు. ఆ సమయంలో అధికార పార్టీ ఉలిక్కిపడింది.
బీజేపీ సైతం జగన్ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ మధ్య బీజేపీ కూడా వైసీపీ ప్రభుత్వంపై వాయిస్ పెంచుతోంది. జగన్ సర్కార్ ఆరాచకాలు హెచ్చుమీరుతున్నాయంటూ విరుచుకుపడుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సైతం జగన్ పాలనపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. చలో విజయవాడ కార్యక్రమం జగన్ పీఠాన్ని కదిలించడంతో.. ఎర్ర పార్టీలు పచ్చ కండువాలు కప్పుకున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ వ్యాఖ్యలు బాగానే ఉన్నాయి గాని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదంటూ విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగాయని, పాలన అస్తవ్యస్థంగా సాగుతోందని కామ్రెడ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి జగన్ బాదుడే బాదుడుకు వైసీపీ వర్గీయులు సైతం బాధితులుగా మారుతున్నారు.
చేసిన పనులకు బిల్లులు రాక సచివాలయాలకే తాళాలు వేస్తున్నారు. జగన్ బటన్ నొక్కినా తమ ఖాతాల్లోకి విద్యా దీవెన డబ్బులు మాత్రం పడడం లేదని బహిరంగంగానే చెబుతున్నారు. అక్కడక్కడా వైసీపీ ఎంపీటీసీలు రాజీనామా చేసి, టీడీపీకి చేరువవుతున్నారు. ఓటీఎస్ స్కీమ్ వల్ల వైసీపీ కార్యకర్తలు సైతం ఇబ్బందులు పడ్డారు.
ఇక ఎమ్మెల్యేల్లో సైతం జగన్ పట్ల వ్యతిరేకత పెరిగిందంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత జగన్ మీద ఉన్న భయం పోయింది. జగన్ను ఎదురించడానికి సైతం సిద్ధమవుతున్నారు. అవసరమైతే జగన్ను పక్కన పెడదామనే ఆలోచనలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు.. తమ దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నట్టు.. విపక్ష పార్టీలు సైతం చెబుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com