TDP Protest on Petrol Rates: పెట్రోల్ రేట్లపై టీడీపీ నిరసన..

TDP Protest on Petrol Rates: పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది తెలుగుదేశం పార్టీ. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. నిరసన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర గట్టిగా హారన్ మోగించి.. నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తానన్న సీఎం జగన్.. 36 రూపాయల వ్యాట్ వసూలు చేస్తూ మాట తప్పారని ఆరోపించారు.
పెట్రోల్,డీజిల్ పై పన్నుల రూపంలో గత రెండున్నరేళ్లలో 28 వేల కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు చంద్రబాబు.రోడ్ డెవలప్ మెంట్ సెస్ పేరిట లీటర్ కు అదనంగా మరో రూపాయి వసూలు చేయడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటి తగ్గించడంతో 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పెట్రోల్,డీజిల్ పై జగన్ చేసిన వీడియోలు ప్రజలకు చూపించాలన్నారు చంద్రబాబు.
పెట్రోల్ పై లీటర్ కు 16 రూపాయలు,డీజిల్ పై 17 రూపాయలు తగ్గించాలన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రబుత్వం మొండిగా ముందుకెళ్తుందని విమర్శించారు. జగన్ అవినీతి,దుబారా, చేతకాని పరిపాలన విధానాలతోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండవన్నారు. అధిక డీజిల్ కారణంగా రైతులపై భారం పడుతుందన్నారు. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర ఏపీలోనే ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com