YCP: వైసీపీ నేతల విధ్వంసం

YCP: వైసీపీ నేతల విధ్వంసం
దళితుల ఇళ్లకు అర్ధరాత్రి నిప్పు... బరితెగించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌రె‌డ్డి అనుచరులు

రాప్తాడు నియోజకవర్లంలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. బుధవారం రాత్రి సమయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు దళిత కాలనీలోని ఇళ్లకు నిప్పంటించారు. అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయారు. ప్రసన్నాయపల్లిలోని దళిత కాలనీలో పూరిళ్లను తగలబెట్టారు. గ్రామంలోని రెవెన్యూ పరిధి 123/2బీ సర్వే నంబరులోని రెండెకరాల్లో స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైసీపీ నాయకులు కన్నేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని రెండు రోజులుగా వైసీపీ నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము నిరాకరించడంతో పలుమార్లు దౌర్జన్యానికి దిగారని బాధితులు తెలిపారు.


బుధవారం జైభీమ్‌ భారత్‌ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రసన్నాయపల్లికి వచ్చి దళితులను పరామర్శించారు. జగన్‌ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అనుచరులు మాకు వ్యతిరేకంగా దస్తగిరిని తీసుకొస్తారా అంటూ రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దళిత కాలనీపై దండెత్తారు. కర్రలు, ఇనుపరాడ్లతో దళితులను విచక్షణరహితంగా కొట్టి, గుడిసెలను తగలబెట్టారు. వైసీపీ నేతల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. జైభీమ్‌ భారత్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇంఛార్జి నరేశ్‌, కార్యకర్త విజయ్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రులను అనంతపురం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైసీపీ నేతల దాడుల నుంచి తప్పించుకున్న దళితులు రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశారు. సీఐ మునిస్వామి శ్రీకాళహస్తిలో బందోబస్తులో ఉండటంతో ఆ సమయంలో అక్కడ ఇటుకలపల్లి సీఐ నరేందర్‌ విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ నాయకులు తమపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తే సీఐ కనీసం పట్టించుకోలేదని.. తిరిగి తమనే అసభ్యపదజాలంతో దూషించారని బాధితులు వాపోయారు.

Tags

Read MoreRead Less
Next Story