AP : వైఎస్ వివేకా వర్థంతి రోజున సునీత సంచలనం.. సెటప్ రెడీ
వైఎస్ జగన్ ఓ కొత్త సవాల్ కు సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసిందా.. ఔననేఅంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో కడప నుంచి రసవత్తర రాజకీయం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ సునీత తన రాజకీయ ప్రకటన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల పదిహేనో తేదీన వైఎస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే సునీత ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె బుక్ చేసుకున్న ఓ ఫంక్షన్ హాలును క్యాన్సిల్ చేశారు. దీంతో కడపకు తన రాజకీయ ప్రకటనను మార్చుకున్నారు.
కడప వేదికగా పదిహేనో తేదీన ఎన్నికల్లో పోటీపై సునీత కీలక ప్రకటన చేయనున్నారు. ఇటీవల ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన సునీత.. .. తనకు ప్రజా మద్దతు కావాలని కోరారు. ప్రజా తీర్పు కావాలన్నారు. ఇందు కోసం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నానని ఏ రూపంలో వెళ్లాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీకా.. పార్లమెంట్ కా అన్నదానిపై స్పష్టతకు వచ్చారని.. పదిహేనో తేదీన ప్రకటిస్తారని భావిస్తున్నారు. పోటీ సునీత చేస్తారా.. ఆమె తల్లి చేస్తారా అన్నది కూడా ఆరోజే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వైఎస్ సునీత లేదా ఆమె తల్లి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి అంగీకారం తెలిపే అవకాశం కల్పించేందుకు ఆ పార్టీ రెడీగానే ఉంది.
ఐతే.. స్వతంత్రంగా పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినా..ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఇతర పార్టీలు మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండవు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే… అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశాలు ఉంటాయి. ఎలా చూసినా ఈ సారి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్సభలో కీలకమైన పోరు జరగడం ఖాయం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com