TTD : జూన్ 30 వరకు తిరుమలలో బ్రేక్ దర్శనం రద్దు
తిరుమలలో రద్దీ పెరుగుతున్న దృష్ట్యా బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఆలయానికి భక్తులు భారీగా తరలిరావడం, ఎన్నికలు పూర్తి కావడం, విద్యార్థులకూ పరీక్షలు ముగియనుండటంతో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం ఉండదని తెలిపింది. ఈ సమయంలో ఏ సిఫార్సు లేఖలను అంగీకరించబోమని పేర్కొంది. క్యూలో సామాన్యుల ఎదురుచూపులను తగ్గించనున్నట్లు తెలిపింది.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కొద్దిరోజులుగా శ్రీవారిని దర్శించుకుంటోన్న భక్తుల సంఖ్య 80 నుంచి 90 వేల మధ్య ఉంటోండటమే దీనికి నిదర్శనం.
వేసవి సెలవులు, పోలింగ్ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30-40 గంటల సమయం క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com