TTD : తిరుమలలో భక్తుల రద్దీ .. దర్శనానికి 20 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని నిన్న 75,125మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,140మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు సమకూరిందని అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం.
మరోవైపు తిరుమల మాడవీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com