ఆరేళ్ల కాపురంలో ఓ యువతి ప్రేమ చిచ్చుపెట్టింది. ఓ వైపు ఇల్లాలు, మరో వైపు ప్రియురాలు. ఇద్దరిలో తాళికట్టించుకున్న భార్యకంటే ప్రియురాలివైపే మొగ్గుచూపాడు ఓ భర్త. భార్యను మోసం చేయడానికే ఆ భర్త నిర్ణయించుకున్నాడు. విషయం బయటపడి భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆ తర్వాత ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడగా ప్రియుడు చనిపోయాడు. ప్రియురాలు కండిషన్ సీరియస్గా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
అచ్చంపేట మండలం నీలేశ్వరపాలేనికి చెందిన బాణావత్ హనుమా నాయక్, వెంగాళాయపాలేనికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే హనుమా నాయక్కు ఆరేళ్ల కిందటే పెళ్లయింది. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆ యువతి టీటీసీ పరీక్షలు రాసేందుకు సత్తెనపల్లిలోని తాత ఇంటికి వెళ్లింది. అక్కిడి నుంచి యువతిని తీసుకెళ్లి.. భార్యకు తెలియకుండా అడవిలో దాచిపెట్టాడు హనుమా నాయక్. పీకలోతు ప్రేమలో ఉన్న ఇద్దరు అడవిలో కాపురం పెట్టారు.
ప్రియురాలికి రోజూ భోజనం తీసుకెళ్తుండటంతో భార్యకు అనుమానం వచ్చింది. ఏం జరుగుతోందని నిలదీయగా ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో దంపతులు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన హునుమా నాయక్ అడవిలోకి వెళ్లి ప్రియురాలితో కలిసి పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రియుడు చనిపోయాడు. ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది.
భర్త ఆత్మహత్యతో భార్య షాక్కు గురైంది. తనకు తీరని అన్యాయం చేశాడని బోరున విలపిస్తోంది. తనకు తన ఆడ పిల్లలకు ఇక దిక్కెవరని కన్నీరుమున్నీరవుతోంది. సాఫీగా సాగిపోతున్న సంసారాన్ని ఆకర్షణలాంటి ప్రేమ కూల్చేసింది. ఓ కుటుంబం పెద్ద దిక్కునుకోల్పోయింది. పిల్లలు తండ్రిలేనివారయ్యారు. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.