తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(ఆగస్టు నెల కోటా)ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదుచేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బు చెల్లించాలి. కాగా ఆగస్టు నెలకు సంబంధించి దర్శనం, గదుల టికెట్లను ఈ నెల 23న, రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను 24న అధికారులు విడుదల చేస్తారు.
మరోవైపు తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకూ మూడురోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు.
వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజైన మే 28వ తేదీ సాయంత్రం స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజలసేవ, రాత్రి వీధి ఉత్సవం నిర్వహిస్తారు.