11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 103 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడు యోగ ఆసనాలు చేసి అబ్బురపరిచారు. బుక్కపట్నం మండలం నారేపల్లికి చెందిన చెన్నప్ప తన 64 వ వయస్సు నుంచే యోగా చేయడం ప్రారంభించానని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు యోగా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెన్నప్ప పేర్కొన్నారు. యోగ చేయకముందు అనారోగ్య పాలైనానని, ఎన్నో అనారోగ్య సమస్యలకు యోగ సమాధానమైంది అన్నారు. 103 ఏండ్లు వచ్చినా తానే స్వయంగా తన పనులను చేసుకోగలుగుతున్నానని, కంటి చూపు చక్కగా కనిపిస్తోందని, చక్కగా నడవగలుగుతున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను తన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.