కృష్ణా జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈదల మద్దాలి వద్ద ఒక్కసారిగా వంతెన కుప్ప కూలింది. అయితే బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ వెనుకభాగం వంతెన కింద పారుతున్న నీటిలో కూరుకుపోయింది. ఇంజిన్ ముందు భాగం వంతెనపైనే ఉండటంతో ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పెదపారుపూడి మండలం నుంచి విజయవాడ వెళ్లే మార్గాన్ని ఇటీవల మూసివేశారు. దీంతో వాహనదారులు నిత్యం ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన నిర్మాణం శిథిలావస్థకు చేరిందని, మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపించారు.