CBN: మరోసారి మానవత్వం చాటుకున్న చంద్రబాబు

అభిమానితో ఫొటో దిగి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి.. అన్ని విధాల అండగా ఉంటామని హామీ;

Update: 2024-10-06 01:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటినుంచో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను నెరవేర్చారు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు. రేణిగుంటకు చెందిన పసుపులేటి సురేంద్రబాబు(30) మానసిక దివ్యాంగుడిగా జన్మించారు. దీనికి తోడు ఇటీవల లివర్ క్యాన్సర్ రావడంతో అనారోగ్యంతో సతమతమవున్నారు. చంద్రబాబు అంటే సురేంద్ర బాబుకు చిన్నతనం నుంచే అంతులేని అభిమానం, అమితమైన ప్రేమ దీంతో ఆయనతో ఫొటో దిగాలని భావించారు. ఎంతో ఇష్టపడే నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చనిపోయే లోపు ఒక్కసారైనా ఫోటో దిగాలన్నది సురేంద్ర బాబు కోరుకున్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిసింది. దీంతో తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్టుకు పిలిపించుకుని సురేంద్ర బాబుతో ప్రత్యేకంగా మాట్లాడి ఫోటో దిగారు. క్యాన్సర్ తో బాధపడుతున్నందున వైద్య ఖర్చులకు 5 లక్షల రూపాయలను ఏపీ ప్రభుత్వం తరపున సాయం అందించారు. భయపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని సురేంద్రబాబుకు 0 చంద్రబాబు భరోసా ఇచ్చారు.

రేపు ఢిల్లీకి చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాజధాని అమరావతికి నిధులు, మరికొన్ని ఇతర అంశాలకు కేంద్ర సాయాన్ని కోరే అవకాశముంది. మరోవైపు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమైన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీఎం చర్చించనున్నారు.

వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది. అయితే గత ప్రభుత్వం కంటే ఇప్పుడే అధిక ధరలున్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టపై దుష్ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గనులశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారిని కట్టడి చేయాలని సూచించారు.

Tags:    

Similar News