CHANDRABABU: చర్చిద్దాం రండి.. రేవంత్కు చంద్రబాబు లేఖ
ఈనెల ఆరున సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు;
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అంతా సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. దీనిపై నేడు రేవంత్రెడ్డి లిఖితపూర్వకంగా స్పందన తెలియచేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతోపాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు.
విభజన హామీలపై కలిసి చర్చించుకొని పరిష్కారం దిశగా అడుగులేద్దామని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నా కూడా సమస్యలు అలాగే ఉన్నాయని, వాటిపై చర్చిద్దామని ఆహ్వానిస్తూ లేఖ రాశారు చంద్రబాబు. జూలై 6న సాయంత్రం భేటీ అవుదామని లేఖలో పేర్కొన్నారు బాబు.ముఖాముఖీ కలిసి మాట్లాడుకుంటే ఎంతటి జఠిలమైన సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని, ఆ రకంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని చంద్రబాబు లేఖ రాశారు మరి, ఈ లేఖపై రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తికాలేదు. ఏమేం చర్చించొచ్చు..? ఈ నేపథ్యంలోనే రేవంత్తో భేటీకి చంద్రబాబు సిద్ధమయ్యారు. ‘నేనే మీ వద్దకు వస్తాను’ అంటూ భేషజాలను పక్కన పెట్టి మరీ లేఖ రాశారు. ఈ భేటీకి ముందు చంద్రబాబు రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఈ అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. దాని కొనసాగింపుగా రేవంత్తో ఆయా అంశాలపై చర్చిస్తారు. జగన్, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి సమావేశమైనా... అది వారిద్దరి వ్యక్తిగత భేటీగానే జరిగింది. ఏ అంశమూ పరిష్కారం కాలేదు. ఈసారి ఇటు చంద్రబాబు, అటు రేవంత్ ఇద్దరూ సానుకూల దృక్పథంతో ఉండటంతో... విభజన అంశాల పరిష్కారంలో ముందడుగు పడే అవకాశముందని అంటున్నారు.
చంద్రబాబు, రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రె్సలో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ శిబిరాల్లో ఉండటంతో వీరిద్దరూ కలుసుకోవడం ఇటీవలి కాలంలో సాధ్యపడలేదు.