సీఎం జగన్ ఉన్మాదిగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మళ్లీ కోలుకోకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రులు అరాచకశక్తులుగా మారారని, వైసీపీ ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అరకు లోక్సభ నియోజకవర్గం టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ హయాంలో ఏజెన్సీ బాక్సైట్ గనుల్ని.. బినామీకి, రస్అల్ ఖైమాకు దోచిపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ లైసెన్స్లు రద్దుచేసినట్టు చెప్పారు. జగన్ పాలనలో అధికారులతో ఇంకో కమిటీ వేసి... బాక్సైట్ నిక్షేపాలు మళ్లీ దోచిపెట్టే పన్నాగాలు వేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అరాచక పాలన గురించి గతంలో చరిత్రలో చదివామన్న చంద్రబాబు.. ఇప్పుడు మనరాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తున్నామని విమర్శలు గుప్పించారు.
జగన్ పాలనలో గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. గిరిజన ఆడబిడ్డల మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని మండిపడ్డారు. కనీసం సురక్షిత తాగునీటిని కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని చంద్రబాబు అన్నారు. ఏలూరులో 700మంది ఆసుపత్రుల పాలవ్వడం సిగ్గుచేటని చంద్రబాబు మండిపడ్డారు. సీసం, నికెల్ కలిసిన తాగునీటి సరఫరా వైసీపీ వైఫల్యానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ అని చంద్రబాబు అన్నారు. కలువాయిలో కూలీలు అస్వస్థతకు గురి కావడం హృదయ విదారకమని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
జగన్మోహన్ రెడ్డి మాయమాటలతో ప్రజలను మోసం చేశారని చంద్రబాబు విమర్శించారు. గిరిజనులకు చట్టపరంగా రావాల్సిన హక్కులను కాలరాశారని మండిపడ్డారు. నేరాలు-ఘోరాలకు పాల్పడిన వైసీపీని ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలని వీడియో కాన్ఫరెన్స్లో నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలపై వైసీపీ దౌర్జన్యాలను ఎండగట్టాలని చెప్పారు. టీడీపీ చేసిన మంచిని, వైసీపీ వచ్చాక జరిగిన చెడును వివరించాలని అన్నారు.