AP : అనుభవం, పవర్ కలిస్తే కూటమి.. గేర్ మార్చిన చంద్రబాబు, పవన్

Update: 2024-04-11 07:12 GMT

ఏపీని సీఎం వైఎస్‌ జగన్‌ దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ఆరోపించారు. ప్రజాగళం సభల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు ప్రసంగించారు. ప్రజాసేవ చేయడమే అధికారమని, జగన్‌కు మాత్రం ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు.

విభజన తర్వాత ఎదురైన కష్టాల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు 2014లో టీడీపీ ఎన్డీయేలో చేరిందన్నారు చంద్రబాబు. జగన్ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకే టీడీపీ మళ్లీ కూటమిలో భాగస్వామి అయిందని చెప్పారు. ఏపీ ఇప్పుడు వెంటిలేటర్‌లో ఉందనీ.. దానిని క్రియాశీల జీవితానికి తిరిగి తీసుకురావడానికి కూటమి ఆక్సిజన్‌లా పనిచేస్తుందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు అవసరమని, పారిశ్రామిక కారిడార్లు కూడా అభివృద్ధి చెందాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మహాకూటమి విజయం కోసం తాను, పవన్ కళ్యాణ్ త్యాగాలు చేశామని చంద్రబాబు అన్నారు. కోట్ల రూపాయల సంపాదన వదిలి పవన్ కళ్యాణ్ జనం కోసం వచ్చారన్నారు. తన అనుభవం, పవన్ పవర్ కలిస్తే కూటమి ప్రగతి శీల ప్రభుత్వం అవుతుందని చెప్పారు చంద్రబాబు. కూటమితోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు పవన్ కల్యాణ్.

Tags:    

Similar News