ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం రోజు కనిపించిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ సభలో మెరిశారు. కానీ కొద్దిసేపే ఉన్నారు. ఇలా వచ్చి అలా వెళ్లారు. గవర్నర్ ప్రసంగం మొదలు పెట్టగానే తమను ప్రతిపక్షంగా గుర్తించాలని... ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఓవైపు గవర్నర్ ప్రసంగిస్తుండగా పది నిమిషాలపాటు నినాదాలు హోరెత్తించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. పోడియం వద్దకు వచ్చి నిలుచున్నారు. ఆ తర్వాత సమావేశాలను బాయ్కాట్ చేసి బయటకు వచ్చేశారు. ప్రభుత్వం, కూటమి పక్షాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.