డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన చివరి నిమిషంలో రద్దు అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవడం కూడా పర్యటన రద్దుకు మరో ప్రధాన కారణం. కాగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం బాపట్ల లో పర్యటించాల్సి ఉంది.
పర్యటన రద్దు అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ అటవీ అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సూర్యలంక రోడ్డులోని నగరవనం అటవీ పార్కులో అటవీ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించాల్సి ఉంది. అంతేకాకుండా, రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాళపత్ర గ్రంథం మొక్కలను సూర్యలంక తీర ప్రాంతంలో నాటాలని కూడా ప్రణాళికలు రచించారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. త్వరలోనే డిప్యూటీ సీఎం బాపట్ల పర్యటన పై మరో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.