జగన్ పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా వ్యవసాయం, తయారీ, పర్యాటకం వంటి ఉప రంగాలను కూడా కుప్పకూల్చిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన పాలన రాష్ట్రానికి, ప్రజలకు భారీ జరిమానా విధించినట్లు అయిందని మండిపడ్డారు. ఈ ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి, పేదల ఆదాయాలు గణనీయంగా తగ్గాయని ఆయన వెల్లడించారు.
‘‘పేదలు సంతోషంగా ఉండటం జగన్కు ఇష్టం లేదు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ఆయన ఓర్వలేకపోతున్నారు. పెట్టుబడులు పెట్టవద్దని లేఖలు రాస్తూ కూటమి ప్రభుత్వ ప్రణాళికలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తీరు ఒక నేరపూరిత వైఖరిని తలపిస్తోంది’’ అని యనమల దుయ్యబట్టారు.