Air Ticket Prices : చివరి నిమిషంలో బుక్ చేసినా ఒకే ధర.. మధ్యతరగతి ప్రజలకు అలయన్స్ ఎయిర్ బంపర్ ఆఫర్.
Air Ticket Prices : సాధారణంగా రైలు లేదా విమాన టికెట్ల ధరలు.. ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. దీంతో చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునే వారికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రాంతీయ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్లైన్స్ ఎయిర్ ప్రయాణికులకు ఊరటనిచ్చే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 13న ప్రారంభించిన ఫెయిర్ సే ఫుర్సత్ అనే ఈ పథకం కింద, ఎంపిక చేసిన రూట్లలో విమాన టికెట్ ధరలు 2025 డిసెంబర్ 31 వరకు స్థిరంగా ఉంటాయి.
ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ అలయన్స్ ఎయిర్, అక్టోబర్ 13 నుండి ఫెయిర్ సే ఫుర్సత్ అనే కొత్త పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ పథకంలో ఎంపిక చేసిన రూట్లలో విమాన టికెట్ ధరలు స్థిరంగా ఉంటాయి. అంటే, మీరు టికెట్ను నెలల ముందు బుక్ చేసినా, లేదా విమానం బయలుదేరే రోజు బుక్ చేసినా ఒకే ధర ఉంటుంది. సాధారణంగా ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఈ పథకం ద్వారా మధ్యతరగతి ప్రయాణికులకు, ముఖ్యంగా చిన్న నగరాల ప్రజలకు చివరి నిమిషంలో టికెట్ ధరలు పెరిగే టెన్షన్ నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ వినూత్న పథకాన్ని ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ గా మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ పథకం ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని కాలపరిమితి 2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంది. ఈ సమయంలో ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమైంది, ప్రయాణికుల స్పందన ఎలా ఉందనే విషయాలను ఎయిర్లైన్ పరిశీలిస్తుంది. ఫలితాలు సానుకూలంగా ఉంటే, భవిష్యత్తులో ఈ స్థిర ధరల విధానాన్ని మరిన్ని రూట్లకు విస్తరించే అవకాశం ఉంది.