ఇంటర్లో సబ్జెక్ట్లు తప్పిందని, కనీసం ఈ సారైనా అన్నీ పాస్ కావాలని తండ్రి కూతురును మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె అపార్టుమెంట్ 5వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి సాయికీర్తికాలనీలోని ధర్మపురి గోదావరి అపార్టుమెంట్లో బాపిరాజు వాచ్మన్గా పనిచేస్తున్నాడు.
ఈయనకు భార్య మహాలక్ష్మి, కూతురు కృష్ణవేణి(19) ఉన్నారు. గోదావరి జిల్లా, గంగవరం, స్వగ్రామమైన కొత్తాడలో కృష్ణవేణి ఇంటర్ పూర్తి చేసింది. కొన్ని సబ్జెక్ట్లు ఫెయిల్ అయింది. బాగా చదువుకొని సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ కావాలని తండ్రి మందలించాడు.
మనస్తాపానికి గురైన కృష్ణవేణి మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో అపార్టుమెంట్ 5వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించి మృతదేహాన్ని గాంధీకి తరలించారు.