రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థకు చెందిన గాంధీనగర్, ఆరావళి, సబర్కాంత, మెహసానా, వడోదరలోని కార్యాలయాలపై దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు. నాటినుంచి గ్రూప్ సీఈవో భూపేంద్రసింగ్ ఝలా పరారీలో ఉండడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఓ ఫామ్హౌస్లో అతడు దాక్కున్నట్లు సీఐడీ అధికారులకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.