యూపీ హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మరణించడంతో ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. అక్కడి ఎటా మెడికల్ కాలేజీలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసి 30 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ రజనీశ్ గుండెపోటుతో మరణించాడు. అతడిని క్విక్ రెస్పాన్స్ టీమ్(QRT)లో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలను వదిలాడు.
హాథ్రస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమానికి వెళ్లి 116 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. బాబా పాదాల వద్ద ఉన్న పవిత్ర మట్టి, జలాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఊపిరాడక అనేక మంది అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు వదిలినట్లు సమాచారం. మృతుల్లో అమాయక మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉండటం అందరినీ కలచివేస్తోంది.
ఈ దుర్ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తోందని కలెక్టర్ ఆశీష్ కుమార్ తెలిపారు.