శివలింగం లాంటి రాతిపై పర్షియన్ శాసనం బయటపడటం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న నల్లమల లోతట్టు అడవి ప్రాంతంలో ఈ సంఘటన వెలుగు చూసింది. రాతిపై చెక్కిన పర్షియన్ శాసనం లభించినట్లు భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
ఈ పర్షియన్ శాసనం ఒక శిలపై చెక్కబడింది. చూడటానికి శివలింగం లాగే కనిపిస్తోంది. ఇది.. నస్తాలిక్ కాలిగ్రఫీ శైలిలో ఉంది. కొంతవరకు తెలుగులిపి కూడా ఉంది. ఈ శాసనం హైదరాబాద్ నిజాముల్ ముల్క్ అసఫ్ జా వంశానికి చెందిన 8వ నవాబు అయిన నవాబ్ ముకర్రం ఉద్ దౌలా బహదూర్కు చెందినదని అధికారులు తెలిపారు. కొందరు ఔత్సాహికులు నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కొల్లంపెంట సమీప అటవీ ప్రాంతంలో పురాతన దేవాలయాన్ని సందర్శించారు.
లింగాకార రాయిని ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్గా మారింది. అలా దేశ పురావస్తు శాఖ అధికారుల దృష్టిలో పడింది. ఏప్రిల్ 9, 1932 నాటి రచన, ఒక బంజరు భూముల్లో చెట్లు, మూలికలను నాటడం, తద్వారా దానికి బెహిష్తాన్ అని పేరు పెట్టడం గురించి దీనిలో ప్రస్తావించబడింది. అప్పటి రెవెన్యూ అధికారి జైన్చంద్ర ద్వారా మహమ్మద్ ఇస్మాయిల్ పేరిట 3వ ధుల్హిజా 1350 హిజ్రి శకం 1932 ఏప్రిల్ 9న శాసనం రాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ శిలను చూసేందుకు జనం తరలివెళ్తున్నారు.