తిరుమల మాడవీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఈ నెల 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను విడుదల చేయనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు తితిదే అవకాశం కల్పించింది. ఆ రోజున మరిన్ని టికెట్లు విడుదల చేయనుంది.