భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.వీరిద్దరూ బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో వినేశ్, బజరంగ్ నేడో, రేపో కాంగ్రెస్ లో చేరడం ఖాయమని సమాచారం. పారిస్ ఒలింపిక్స్లో మహిళల 50 కిలోల రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్స్ వరకు విషయం తెలిసిందే. ఫైనల్స్ లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగాట్ అనర్హతకు గురైంది.దీంతో ఆమె పతకాన్ని కోల్పోయింది. దీంతో ఫొగాట్ భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కోర్టులోనూ వినేశ్ కు ఊరట దక్కలేదు. అయితే, ఫైనల్స్ లో అనర్హత వేటుకు గురైన వెంటనే నిరాశ చెందిన వినేశ్.. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలున్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వినేశ్ ఫొగాట్ పారిస్ నుంచి భారత్ కు చేరుకున్న టైమ్ లో జనం ఆమెకు ఘన స్వాగతం పలికారు. హర్యానాలోని సొంత గ్రామంలోనూ భారీ ర్యాలీ నిర్వహించారు.
వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ తోనూ భేటీ అయ్యారు.తొందరలోనే జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. హర్యానాకు ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసింది. కాంగ్రెస్ రెండో జాబితాలో వినేశ్, బజరంగ్ పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.