మెగా డీఎస్సీ అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఉద్యోగార్థులు మండిపడ్డారు. వేల ఉపాధ్యాయ ఖాళీలుంటే తక్కువ పోస్టులు వేసి జగన్ ప్రభుత్వం నాటకాలాడుతోందని నిరుద్యోగులు అనంతపురం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. జిల్లాలో నాలుగున్నరేళ్లుగా 4వేల మంది డీఎస్సీ కోసం ఎదురుచూస్తుంటే కేవలం 4 ఎస్జీటీ పోస్టులు వేశారన్నారు. తొలుత నగరంలో ర్యాలీ తీశారు. ప్రధాన రహదారిపై అరగంట బైఠాయించారు. ఆ తర్వాత కలెక్టరేట్ గేట్లను తోసుకొని, లోనికి చొచ్చుకెళ్లారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కలెక్టర్ ఛాంబర్ దాకా వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్ధృతంగా మారడంతో పోలీసులు నిరుద్యోగులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు.