ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) అభిమాని మృతిచెందారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కొంతమంది ఒకచోట చేరి హైదరాబాద్, ముంబై మ్యాచ్ను చూశారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో సీఎస్కే అభిమాని అయిన 63 ఏళ్ల బండోపంత్ టిబిల్ హేళనగా మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నారు.
ఆగ్రహించిన ముంబై ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బండోపంత్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. టిబిల్కు భార్య, ముగ్గురు కుమార్తెలు, అల్లుడు, కొడుకు, మనుమలు, సోదరులు, సోదరీమణులు ఉన్నారు. ఇక ఈ సంఘటనలో ఇప్పటికే నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆటను కేవలం వినోదంగా చూడాలని, ఇలా ఓ వ్యక్తిని కొట్టి చంపడం దారుణమంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రెండ్రోజుల క్రితం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై 246 పరుగులకు పరిమితమై 31 పరుగుల తేడాతో ఓడింది.