ఐపీఎల్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించారు. 250 మ్యాచ్లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కారు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆయన ఈ ఘనత అందుకున్నారు. అగ్ర స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ (257), ఆ తర్వాత రోహిత్ శర్మ (250), విరాట్ కోహ్లీ (245), రవీంద్ర జడేజా (233) ఉన్నారు. కాగా దినేశ్ కార్తీక్ 2008 ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతూ వస్తున్నాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరుపున ఐపీఎల్లో అడుగు పెట్టిన కార్తీక్ వివిధ జట్ల తరుపున అన్నీ సీజన్లలోనూ ఆడాడు. ఈ ఐపీఎల్ సీజన్లో డీకే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఏకంగా 205 స్ట్రైక్ రేట్తో 226 పరుగులు బాదారు.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్లు వీరే..
ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్) – 257 మ్యాచులు
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) – 250 మ్యాచులు
దినేశ్ కార్తీక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 250 మ్యాచులు
విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 245 మ్యాచులు
రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్) – 233 మ్యాచులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఆర్సీబీ మరో ఓటమి మూటగట్టుకుంది. తాజాగా కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 223 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆ జట్టు 221 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో కర్ణ్ శర్మ 3సిక్సర్లు కొట్టినా అతడు ఔట్ కావడంతో ఆర్సీబీ ఓటమి చెందింది. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ 3, హర్షిత్, నరైన్ తలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి.