IND VS PAK: మ్యాచ్ తిలకించాలంటే... హోటళ్లకు అక్షరాలా ఓ లకారం చెల్లించాల్సిందే!
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేళ ఆకాశన్నంటిన హోటల్ అద్దె... ఒకరోజుకు అక్షరాల లక్ష వసూలు చేస్తున్న హోటల్ నిర్వాహకులు.. అయినా తగ్గేదేలే అంటున్న క్రికెట్ ప్రేమికులు..;
భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు దానిని మ్యాచ్లా కాకుండా యుద్ధంలా చూస్తారు. మైదానంలో ఆటగాళ్ల కవ్వింపులు, ఉద్వేగపూరిత క్షణాలు మ్యాచ్ను ఆసక్తికరంగా మారుస్తాయి. ICC ఈవెంట్లలో మాత్రమే ఎప్పుడో ఓసారి తలపడే దాయాదుల పోరును చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. అలాంటిది క్రికెట్ను అమితంగా ప్రేమించే మన దేశంలో... అదీ ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో భారత్-పాక్ తలపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా.. అందుకే మ్యాచ్కు సుమారు 90 రోజుల ముందే హోటల్ బుకింగ్లు జోరందుకున్నాయి. అక్టోబర్ 15న జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు గుజరాత్ అహ్మదాబాద్లోని ఒకరోజు బస చేయాలంటే అక్షరాల లక్ష రూపాయలు చెల్లించాల్సిందే. అయినా సరే మ్యాచ్కు మూడు నెలల ముందే విలాసవంతమైన హోటల్లో అన్ని ఫుల్ అయిపోయాయి.
అహ్మదాబాద్లో ఇప్పటితో పోలిస్తే అక్టోబర్ 15 నాటికి దాదాపు 10 రెట్లు హోటల్ రెంట్ పెరిగింది. కొన్ని హోటల్లో భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున హోటల్లో ఉండేందుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు భారత్- పాక్ మ్యాచ్ రోజు హోటల్ గదులు బుక్ అయ్యాయని నిర్వాహకులు తెలిపారు. అహ్మదాబాద్లోని విలాసవంతమైన హోటళ్లలో ప్రసుతం ఒకరోజు హోటల్ గది అద్దె 5 వేల నుంచి 8 వేల వరకు ఉండగా.. అక్టోబర్ 15 నాటికి ఇది 40 వేల నుంచి లక్ష రూపాయలకు పెరిగింది. జులై 2న ఒక డీలక్స్ గది అద్దె 5 వేల 700 ఉండగా... అక్టోబర్ 15వ తేదీన ఇలాంటి హోటళ్లలో బస చేయాలనుకుంటే 72 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని హోటల్ బుకింగ్ పోర్టల్ బుకింగ్ డాట్ కామ్ వెల్లడించింది.
రినైసెన్స్ అహ్మదాబాద్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె 8 వేలు ఉండగా... అక్టోబర్ 15న 90 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో అక్టోబర్ 15న గదులు బుక్ అయ్యాయి. ప్రవాస భారతీయులు ఎక్కువగా హోటల్ గదులు బుక్ చేసుకున్నట్లు సమాచారం. బడ్జెట్ హోటళ్లలో మాత్రం ఈ ధరల పెరుగుదల కనిపించలేదు. మధ్య తరగతి క్రికెట్ అభిమానులు మ్యాచ్ జరిగే రోజే అహ్మదాబాద్ చేరుకుంటారని వారికి హోటల్లో ఉండే ఉద్దేశం ఉండదని హోటల్ నిర్వాహకులు తెలిపారు.