టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత తరఫున అత్యధిక సార్లు 5వికెట్లు తీసిన కుంబ్లే రికార్డును సమం చేశాడు. కుంబ్లే (Anil Kumble) 35 సార్లు 5 వికెట్లు తీయగా.. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి అశ్విన్ ఈ ఘనత సాధించారు. కుంబ్లే 132 టెస్ట్ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్ కేవలం 99 టెస్ట్ల్లోనే ఈ ఘనతను సమం చేశాడు.
ఈ మ్యాచ్లో అశ్విన్ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్(265), కపిల్ దేవ్(219), రవీంద్ర జడేజా(210) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ఓవరాల్ గా టెస్టుల్లో అత్యధికంగా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు 5వికెట్లు తీశారు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (145 టెస్ట్ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్ తర్వాతి స్థానంలో రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్ల్లో 36 సార్లు) ఉన్నాడు.