Telangana Assembly Session : 24నుంచి అసెంబ్లీ.. బడ్జెట్పై రేవంత్ కసరత్తు
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈ నెల 23న కేంద్ర పూర్తిస్థాయి బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వార్షిక బడ్జెట్ కు సన్నద్ధమవుతోంది. ఈ నెల 31లోగా బడ్జెట్ కు ఆమోదం తెలుపకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
ఈ నేపధ్యంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాడే రాష్ట్ర కేటాయింపులను చూసి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 25న లేదంటే 26న వార్షిక బడ్జెట్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ఎన్ని రోజులు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. గురువారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బడ్జెట్ సమావేశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జితేందర్ అదనపు డీజీ మహేశ్ కుమార్ భగవత్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు, జీఏడీ అధికారులు హాజరయ్యారు.