TG : ఒడిశా నైనీబ్లాక్‌ నుంచి బొగ్గు ఉత్పత్తిపై భట్టి సమీక్ష

Update: 2024-07-17 09:46 GMT

సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శభట్టి విక్రమార్క మల్లు సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సచివాలయంలో నైనీ బొగ్గు బ్లాకు పై ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్, ఇతర అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ బొగ్గు బ్లాక్ కు సంబంధించి ఇటీవలనే ఆయన ఒడిశా రాష్ట్రంలో పర్యటించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో చర్చించారు. అలాగే నిర్వాసిత గ్రామ ప్రజలతో, స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరాతో కలిసి సహకారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు. నైని బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో, సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు, తదుపరి ఆ స్థలం అప్పగింత పై ఒడిశా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని ఆయన సింగరేణి సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైనీ జనరల్ మేనేజర్ కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

Tags:    

Similar News