బీఆర్ఎస్ పార్టీకి బిగ్షాక్ తగిలింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న గువ్వల బీజేపీ గూటికి చేరే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి బీఆర్ఎస్ లో కొనసాగారు గువ్వల. దీంతో గత మూడు ఎన్నికల్లో ఆయనను అచ్చంపేట అభ్యర్థిగా బరిలోకి దించింది గులాబీ పార్టీ. 2014, 2018లో ఆయన వరుస విజయాలు సాధించారు. కానీ, గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి నాటి నుంచి కూడా ఆయన బీఆర్ఎస్ లో యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు. వారం క్రితం హరీష్ రావు నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలోనూ పాల్గొన్నారు. మరికొందరు నేతలు పార్టీని వీడే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి.
అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపించారు. గువ్వల బాలరాజు బాటలోనే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి అబ్రహం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు బదులుగా విజయుడికి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతోనే అబ్రహం పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అప్పట్లో కూడా అబ్రహం బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు గువ్వల బాలరాజుతో కలిసి రాజీనామా చేయడంతో, అబ్రహం కూడా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.