ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సోమవారమే దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో నేటికి వాయిదా పడింది. ఈనెల 10న 200 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసిన ఈడీ.. అందులో చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ఉద్యోగులు దామోదర్, ప్రిన్స్, చన్ప్రీత్తో పాటు అర్వింద్సింగ్ అనే వ్యక్తిని నిందితులుగా చేర్చింది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపు 46 రోజులుగా కవిత తీహార్ జైల్లోని కాంప్లెంక్స్ 6 (మహిళ ఖైదీలు ఉండే కాంప్లెక్స్) లో ఉంటున్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. కాగా తనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ, బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం.. విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.