TS : కల్లబొల్లి మాటలు నమ్మొద్దు .. నేను పక్కా లోకల్ : రఘురాంరెడ్డి

Update: 2024-04-29 07:11 GMT

 తాను పక్కా లోకల్ అని, తనకు ఓటు వేసి గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ప్రజలను కోరారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గా సమీపంలోని మార్నింగ్ వాకర్స్ ను రఘురాం రెడ్డి కలిసి మాట్లాడారు. పాత డీఆర్డీఏ సమీపంలోని హోల్ సేల్ వెజిటేబుల్ మార్కెట్​లో వ్యాపారులను, హమాలీలను, వినియోగదారులను ఓట్లు అభ్యర్థించారు. ఉల్లిగడ్డ బస్తా తన భుజాలపై మోశారు. అనంతరం సీపీఎం ఆఫీసుకు వెళ్లి మద్దతు కోరారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా నియంతృత్వ పరిపాలన సాగిస్తూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు పరుస్తోందన్నారు.

మొదటి, రెండవ దశ పోలింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఖంగుతిన్న బీజేపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మేనిఫెస్టోపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. తానను గెలిస్తే జిల్లా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ రఘురాంరెడ్డికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ఐదు హామీలను పూర్తి చేసిందని, బీఆర్ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని రఘురాం రెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం అశ్వారావుపేట టౌన్ లోని పోలీస్ స్టేషన్ సెంటర్ లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితం జిల్లాకు అంకితం చేస్తున్నానని వాగ్దానం చేశారు. తమది త్యాగాల కుటుంబమని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు అయ్యే లోపు జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమన్నారు.

Tags:    

Similar News