తెలంగాణ (Telangana) రాష్ట్రం జయశంకర్ (Jayashankar) భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నస్తూరిపల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్తో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కమాండో (కానిస్టేబుల్) ప్రవీణ్ అత్యంత విషాదకర స్థితిలో ప్రాణాలు విడిచాడు.
అడవుల్లో జంతువుల కోసం దుండగులు విద్యుత్ తీగలు పెడుతుంటారు. అవి ప్రమాదవశాత్తూ తగిలి కానిస్టేబుల్ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే కూంబింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జంతువులను వేటాడేందుకు ఇనుపకంచెకు దుండగులు కరెంట్ పెట్టారు. విషయం తెలియక ఇనుపకంచెను పట్టుకుని కానిస్టేబుల్ మృతి చెందాడు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కరెంట్ తీగలు పెట్టిన వారిని పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.