హైదరాబాద్ ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రధానంగా సనత్నగర్ - మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను సిద్ధమైంది. రక్షణశాఖ - రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి.
రెండోదశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తిచేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ కు రానున్నారు. అదే రోజు సనత్నగర్ - మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ - ఘట్కేసర్ లైన్ కూడా అదేరోజు ప్రారంభమయ్యే అవకాశముంది. చర్లపల్లి స్టేషన్ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి దూరప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికులు అందించాలన్నా, అక్కడ దిగినవారిని నగరానికి తీసుకురావాలన్నా.. ఎంఎంటీఎస్ సర్వీస్ లను సమయానికి నడవాల్సిన అవసరముంది. సనత్ నగర్ - మౌలాలి లైనుతోనే ఇది సాధ్యమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మొత్తానికి మార్చిలో నగరవాసుల ప్రయాణ కష్టాలు మరింత తీరనున్నాయి.