తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి తీవ్రమైన లోటు బడ్జెట్ ఉన్నా.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా పాలన సాగిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komatireddy Venkat Reddy ) అన్నారు. త్వరలోనే రూ.30వేల కోట్లతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని తెలిపారు.
ఆదివారం నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ప్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.325 కోట్లతో ఈ పనులను డిసెంబరు లోగా పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాకు 500 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ రహదారులు తెచ్చామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. తన జీవితం ప్రజలకే అంకితమని చెప్పారు. నకిరేకల్ టోల్ గేట్ వద్ద ఎన్నారైల సహకారంతో ట్రౌమా కేర్ సెంటరు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో వారం, పది రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కార్యక్రమం చేపడతామని చెప్పారు.