అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు.. బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలతో కలిపి నలుగురికి అవకాశామివ్వాలని రేవంత్ యోచిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు కేబినెట్లో చోటు దక్కలేదు. దీనిపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికి ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. తొలి మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి ఇద్దరు మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి ఉండగా.. ఆదిలాబాద్ నుంచి ముగ్గురు పార్టీ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్ బరిలో ఉన్నారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ కేబినెట్లో 11 మంది మంత్రులుండగా.. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ లభించే ఛాన్స్ ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గతంలో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ముందుకెళ్తుంది. మైనార్టీ కోటాలో ఫిరోజ్ఖాన్కు మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
కాగా, ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు.