SHARMILA: బైబిల్ మీద ఒట్టు.. ట్యాపింగ్ నిజమే
ఫోన్ ట్యాపింగ్ వెనుక జగన్ ఉన్నారన్న షర్మిల;
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమని వైఎస్ షర్మిల అన్నారు. తన ఫోన్, తన భర్త ఫోన్, తన దగ్గర వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని అన్నారు. ట్యాపింగ్ ఆడియో ఒకటి తనకు వినిపించారని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఎక్కడికైనా వస్తానని.. విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కే కుట్ర జరిగిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్, జగన్ కలిసి ప్లాన్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
షర్మిల ఏమన్నారంటే...
‘‘ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధరించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తా. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్. కేసీఆర్ కోసం జగన్ నన్ను తొక్కి పెట్టాలని చూశారు" అని షర్మిల అన్నారు. "నేను తెలంగాణలో పార్టీ పెట్టడంలో జగన్కు ఏ సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశారు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారు. నా ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారు. నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారు. రాజకీయంగా నా వాళ్లు రానివ్వకుండా చేశారు.’’ అని షర్మిల అన్నారు.
బీఆర్ఎస్పై తీవ్ర అభియోగాలు
గతంలో షర్మిల తెలంగాణలో ఉన్న సమయంలో ఆమె ఫోన్ ట్యాప్ జరగడం.. ఆమె కదలికలను అప్పటి ప్రభుత్వం ముందస్తుగానే తెలుసుకుని అరెస్ట్ చేయడం, అడ్డుకోవడం, హౌజ్ అరెస్ట్లు చేయడం వంటి ఘటనలు జరిగాయి. షర్మిల ఏయే రాజకీయ నాయకుడితో మాట్లాడుతుందన్న విషయాలతో పాటు వ్యక్తిగత కాల్స్ను ట్యాప్ చేసి జగన్కు సమాచారం అందించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో షర్మిల స్టేట్మెంట్ను రికార్డు చేస్తే ఈ కేసులో మరికొన్ని కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉంది. అయితే షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు సాక్షిగా పెట్టి స్టేట్మెంట్ రికార్డు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ను జూబ్లీహిల్స్ పోలీసులు రికార్డు చేశారు. అలాగే జడ్పీ చైర్పర్సన్ సరిత కూడా తన ఫోన్ ట్యాప్ అయ్యినట్లు తెలపడంతో ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. ఆమెకు నోటీసులు పంపించే అవకాశం ఉంది. షర్మిలను కూడా సాక్షిగా పరిగణిస్తూ స్టేట్మెంట్ను రికార్డు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల స్టేట్మెంట్ను రికార్డు చేస్తే ఈ కేసులో మరికొన్ని కీలకమైన అంశాలు బయటపడే అవకాశం ఉంది.