AP: మా రాజీనామాలను ఆమోదించండి
మండలి ఛైర్మన్ను కలిసిన ఎమ్మెల్సీలు.. రాజీనామాలను ఆమోదించాలని వినతి.. మోషన్ రాజుకు ఆరుగురు ఎమ్మెల్సీల వినతి
తమ రాజీనామాల వ్యవహారంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆరుగురు ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలి ఛైర్మన్ మోషెన్ రాజుకు విజ్ఞప్తి చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు గతంలో రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలను మండలి ఛైర్మన్ ఆమోదించకుండా పెండింగ్ లో ఉంచారు. రాజీనామాలను పెండింగ్ లో ఉంచడంపై ఇప్పటికే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. తన రాజనామా లేఖపై తగిన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసేలా మండలి ఛైర్మన్ ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తాజాగా రాజీనామాపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆ ఆర్డర్ కాపీని జయమంగళ.. మండలి ఛైర్మన్ కు అందించారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి.. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగలేనని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకుంటున్నా కాబట్టే రాజీనామా ఆమోదించాలని కోరుతున్నట్లు తెలిపారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, జాకియా ఖానం, మర్రి రాజశేఖర్ లు సైతం వైసీపీ నుంచి గెలిచి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా కొనసాగలేమని తేల్చి చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు.
పెండింగ్లో రాజీనామాలు
తన రాజీనామాను ఛైర్మన్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారంటూ జయమంగళ హైకోర్టును ఆశ్రయించారు. రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మండలి చైర్మన్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో జయమంగళ వెంకట రమణ శాసనమండలి చైర్మన్ను కలిసి హైకోర్టు కాపీ అందజేశారు. జయమంగళతో పాటు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు మండలి ఛైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. డిప్యూటీ చైర్ పర్శన్ జాకీయా ఖానమ్, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ రాజీనామాలు మండలి ఛైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. నెలలు తరబడి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చైర్మన్ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. పలుమార్లు స్వయంగా ఛైర్మన్ని కలిసి ఆమోదించాలని కోరినా ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇవాళ జయమంగళతో పాటు మిగిలిన అయిదుగురు ఎమ్మెల్సీలు ఛైర్మన్ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా వెంకటరమణ గెలుపొందారు. 2024 నవంబర్లో తాను ఇచ్చిన రాజీనామా లేఖపై శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజు నిర్ణయం తీసుకోలేదంటూ హైకోర్టును ఆయన ఆశ్రయించారు.