ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన వైసీపీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు మాజీ సీఎం జగన్ ( Jagan ) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ క్యాడర్పై జరుగుతున్న దాడులతో బాధితులుగా మారిన వారికి అండగా నిలబడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. త్వరలోనే వారిని పరామర్శించి, భరోసా కల్పిస్తానని జగన్ ఇటీవల నేతలతో భేటీలో చెప్పినట్లు సమాచారం. దీంతో జగన్ మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాల్లో ఘనవిజయం సాధించి యావత్ దేశాన్ని నివ్వెర పరిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైంది. వైసీపీకి గట్టి పట్టు ఉందని భావించిన రాయలసీమలోనూ ఫ్యాన్ పార్టీ కకావికలమైంది. 2019 ఎన్నికల్లో 52 స్థానాలకు గానూ.. 49 చోట్ల ఘన విజయం సాధించిన వైసీపీ.. ఈసారి కేవలం 7 సీట్లకే పరిమితమైంది.