తెలంగాణలో (Telangana) ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను వైద్యారోగ్యశాఖ అప్రమత్తం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలంది. ఎండలో పనిచేయడం, ఆటలాడటం, చెప్పులు లేకుండా బయట తిరగడం వంటివి చేయవద్దని కోరింది.
మద్యం, చాయ్, కాఫీ, స్వీట్స్, కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో వేడిగాలులు వీస్తున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఉప్పల్లో 43.3, శేరిలింగంపల్లిలో 43.1, కుత్బుల్లాపూర్లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఏపీలో (AP) నేటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రం కానున్నాయి. కడప, నంద్యాల, కర్నూలు, అనంతనపూర్ జిల్లాల్లో 40-43 డిగ్రీలు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో 40-44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం,శ్రీకాకుళం , కాకినాడ, తూ.గో జిల్లాల్లోనూ 40- 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వడగాల్పులు అధికంగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.